ఎంత కష్టం...ఎంత నష్టం. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రభావితం కాని రంగం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు మనుషులు కూడా లేరు. ఈ మహమ్మారి పుణ్యమా అని మానవాళి ఎదుర్కుంటున్న కష్టాల్లో మన దేశంలోని ఎందరో ఎన్నో రకాలుగా బాధపడుతున్న వారున్నారు. తాజాగా మరో సంచలన అంశం తెరమీదకు వచ్చింది. నిజంగా ఈ కష్టం ఎవరికీ రావద్దు అని కోరుకోవాల్సింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తన ‘ఐఎల్ఓ మానిటర్ సెకండ్ ఎడిషన్ – కొవిడ్ 19 అండ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ఠ్ ‘ పేరుతో రిలీజ్ చేసిన రిపోర్టులో సంచలన వివరాలు వెల్లడించింది.
కరోనాతో ప్రపంచంలో ఏర్పడిన సంక్షోభం రెండో ప్రపంచ యుద్ధం కన్నా దారుణంగా ఉందని ప్రపంచ కార్మిక సంస్థ హెచ్చరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వర్కర్లకు ఇబ్బందులు తప్పవని ఐఎల్ఓ చెప్పింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల మంది ఫుల్ టైమ్ జాబ్ లు కోల్పోతారని ప్రపంచ కార్మిక సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత రంగంలో 200 కోట్ల మంది పని చేస్తున్నారని, వారికి రిస్క్ ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇండియా, నైజీరియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ కారణంగా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. భారతదేశంలో 40 కోట్ల మంది కరోనా కారణంగా పేదరికంలోకి వెళ్లిపోతారని ప్రపంచ కార్మిక సంస్థ హెచ్చరించింది. అమెరికాలో 50 లక్షలు, యూరప్లో 1.2 కోట్లు, ఆసియా పసిఫిక్ రీజియన్లో 12.5 కోట్ల మంది పూర్తి స్థాయి ఉద్యోగాలు కోల్పోతారని చెప్పింది.
ఇక ఏ రంగాల్లో ఉద్యోగాలు పోతాయనే విషయాన్ని పేర్కొంటూ ఆహార రంగం, ఆతిథ్యం, ఉత్పత్తి, రిటైల్ ఇతర సెక్టార్లలో పని చేసేవారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ దీనిపై స్పందిస్తూ ప్రపంచ దేశాలకు కరోనా అనంతర పరిస్థితులు పెద్ద పరీక్ష అని స్పష్టం చేశారు. ``ఒక దేశం ఫెయిలైతే, అన్ని దేశాలు ఫెయిలైనట్లే. అన్ని సెగ్మెంట్లలో సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది’ అని ఆయన తేల్చిచెప్పారు.