కరోనాతో అన్నిరంగాలూ కుదేలవుతున్నాయి. ఇందులో క్రీడారంగం కూడా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే అనేక టోర్నీలు రద్దు అయ్యాయి. అన్ని సిద్ధం చేస్తున్న క్రమంలో టోక్యోలో నిర్వహించాల్సిన ఒలింపిక్స్ కూడా రద్దు అయ్యాయి. అయితే.. తాజాగా.. భారత్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్-2020 గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ అవుతోంది. ఒకవేళ ఐపీఎల్ రద్దయితే బీసీసీఐ మాత్రం భారీస్థాయిలో నష్టపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐపీఎల్–2020 సీజన్ జరగకపోతే బోర్డుకు భారీ నష్టం రానుంది. ప్రంపచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 నుంచి రక్షణ పొందే కవరేజి లేకపోవడంతో దీనికి సాధారణ బీమా వర్తించదు. దీంతో ఈ ఏడాది లీగ్ రద్దయితే సుమారు రూ. 3800 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో ఎక్కువ నష్టం బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్కే కావడం గమనార్హం. ఏకంగా రూ. 3200 కోట్లు అధికారిక బ్రాడ్కాస్టర్కు వాటిల్లుతుందట.
అయితే ఐపీఎల్-2020 లీగ్ జరగలేదు కాబట్టి ప్రసారహక్కుల కోసం తాము చెల్లించాల్సిన మొత్తం నుంచి భారీ స్థాయిలో మినహాయింపు ఇవ్వాలని స్టార్స్పోర్ట్స్ కచ్చితంగా బీసీసీఐని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మిగతా రూ. 600 కోట్లు స్టేక్హోల్డర్లకు వస్తుందని ఆ నివేదిక. అంటే బోర్డుతో పాటు, ఫ్రాంచైజీలు, ఆతిథ్య వేదికల రాష్ట్ర క్రికెట్ సంఘాలు, లాజిస్టిక్స్, హోటల్స్, స్థానిక సంస్థలు, అలాగే పన్ను రూపేణా ఆయా ప్రభుత్వాలకు తీవ్ర ఈ నష్టం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకైతే ఈ సీజన్ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దేశంలో లాక్డౌన్ కొనసాగించే అవకాశలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్డౌన్ను పొడిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2020 నిర్వహించడం కష్టమైన పనే. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుస్తూనే ఉంది. ఈ రెండుమూడు రోజుల్లోనే కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.