ప్రపంచమంతటా కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు నిర్విరామంగా చేస్తున్న శ్రమ మాటల్లో చెప్పలేనంత విలువైనది. ఒకవేళ వాళ్లే లేకపోతే ప్రపంచం మొత్తం ఇప్పటికే స్మశాన వాటికగా మారిపోయేది. కరోనా వైరస్ ప్రాణాంతకమైన అంటువ్యాధి అని తెలిసిన చాలా మంది డాక్టర్లు వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లి చికిత్సనందిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు తమకు సరైన రక్షణ వస్తువులు లేకపోయినప్పటికీ... తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు కనిపించే దేవుళ్ళు అని ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు చెప్తున్నారు అంటే వారు ఎంత కీలకమైన పాత్ర వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని కాపాడే ఆర్మీ కంటే ప్రస్తుతం వైద్యులే ఎక్కువగా శ్రమిస్తున్నారు. అందుకే వారి శ్రమను గుర్తించి వారిని అభినందించడం మన యొక్క బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోడీ మన తోటి చప్పట్లు కొట్టించాడు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే కాదు రాష్ట్ర సీఎం లు కూడా వైద్యులకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నారు.


తాజాగా హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ... కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, ఇతర పారామెడికల్ సిబ్బందికి రెట్టింపు జీతాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు వైద్యులకు, నర్సులకు డబల్ శాలరీలు ఇస్తామని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే పోలీసులు కూడా డాక్టర్ల స్థాయిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు శ్రమ పడుతున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా విధినిర్వహణలో కోవిడ్ 19 వ్యాధి కారణంగా చనిపోతే వారికి 30 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.


హర్యానా రాష్ట్రం కంటే ముందే పంజాబ్ రాష్ట్రం కూడా కరోనా వైరస్ ని అదుపులోకి తెచ్చేందుకు రేయింబవళ్ళూ శ్రమపడుతున్న పోలీస్ వైద్య సిబ్బంది కి 50 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా తాను ప్రకటించిన రూ. లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీలో కరోనా వ్యాప్తి నిర్మూలన కొరకై ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి రూ. 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ని కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: