ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కరోనా పరీక్షల్లో అనంతపూర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2 కేసులతో కలిపి రాష్ట్రం లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365 కి పెరిగింది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 
 
సీఎం జగన్ ప్రెస్ మీట్ల ద్వారా, వీడియో సందేశాల ద్వారా కరోనా గురించి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని చెప్పడంతో పాటు ప్రజలకు తగిన సూచనలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ల్యాబ్ లను ఏర్పాటు చేయడంతో పాటు మెడ్ టెక్ సంస్థ సహాయసహకారాలతో వేల సంఖ్యలో టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చేలా చేస్తున్నారు. రాష్ట్రంలో గత నెల 29న రేషన్ పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టిన జగన్ ఈ నెల 15, 29 తేదీలలో మరలా ఉచితంగా బియ్యం, పప్పు ఉచితంగా అందించనున్నారు. 
 
ఈ నెల 4వ తేదీన రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయల నగదు అందించారు. కరోనా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు అప్రమత్తం చేస్తున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా, రెడ్ జోన్లుగా ప్రకటించి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 
 
గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎంలు, ఆర్పీల సేవలను నిరంతరం వినియోగించుకుంటూ... ప్రతిరోజూ సర్వేలు నిర్వహిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారులు ఎక్కడైనా కరోనా కేసు నమోదైతే వెంటనే వారి సన్నిహితులను, బంధువులను ఆస్పత్రులకు తరలిస్తూ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో గత రెండు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: