ప్రధాని మోడీ రేపు మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. మంగళవారంతో లాక్డౌన్ గడువు ముగుస్తుండడంతో జాతినుద్దేశించి ప్రధాని చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లాక్డౌన్ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లాంటి అంశాలపై రేపు క్లారిటీ వస్తుందా..?
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు యావత్ దేశం పోరాడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల లాక్డౌన్ 14వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ను పొడిగించాలా.. వద్దా.. అనే అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా లాంటి రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సూచించాయి. ఈ నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ ఒడిశా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది.
రాష్ట్రాల వినతులను దృష్టిలో ఉంచుకుని ఈసారి లాక్డౌన్ మరోసారి పొడిగించే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సారి కొన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నిత్యావసరాలకు మాత్రమే పర్మీషన్ ఇచ్చారు. ఈ సారి నిత్యావసరాలతో పాటు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రంగాలకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
నిత్యావసరాలు మినహా రాష్ట్రాల మధ్య రాకపోకలపై మాత్రం ఆంక్షలు కొనసాగే ఛాన్స్ ఉంది. అలాగే స్కూళ్లు, కాలేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాలపై కూడా నిషేధం కొనసాగనుంది. అయితే సోషల్ డిస్టన్స్ నిబంధనలతో విమానయానం, పారిశ్రామిక రంగం లాంటి కొన్ని కీలక రంగాలకు మినహాయింపులు ఇస్తారని సమాచారం.
విమానయాన రంగంపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రంగానికి మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ క్లాస్లో అయినా మూడు సీట్లలో మధ్య సీటును వదిలేసే విధంగా ఆదేశాలు ఇవ్వచ్చు. అయితే దేశీయంగా కొన్ని విమాన సర్వీసులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు. పలు దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇప్పట్లో అనుమతి ఉండకపోవచ్చు.
దేశవ్యాప్తంగా మొత్తం 736 జిల్లాలుండగా.. అందులో 75 జిల్లాల్లో మాత్రమే కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో మాత్రం కఠిన ఆంక్షలు అమలు చేస్తూ మిగిలన జిల్లాల్లో లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే లాక్డౌన్ లాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. క్షమించాలని గత వీడియో కాన్పరెన్స్ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. దీంతో ఈసారి కాస్త సడలింపు ఇవ్వడం ద్వారా ఇటు ప్రజలకు, అటు ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.