ఓవైపు దేశమంతా లాక్డౌన్ అమల్లో ఉంది. ఏప్రిల్ 14 వరకూ ఈ లాక్ డౌన్ అమలవుతుందన్న సంగతి తెలిసిందే. మరి లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏంటి.. అసలు అప్పుడే లాక్ డౌన్ ఎత్తేస్తారా.. లేకపోతే మరికొంత కాలం పొడిగిస్తారా.. దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేస్తే.. అసలు కరోనా అదుపులోకి వస్తుందా.. ఈ అనుమానాలన్నీ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలో పాక్షికంగా లాక్డౌన్ ఎత్తేయాలని వైసీపీ సర్కారు ఆలోచిస్తోందా.. రాష్ట్రంని కొన్ని హాట్ స్పాట్ ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తున్నా.. పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తివేతకు జగన్ సర్కారు ఆలోచిస్తోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్స్పాట్ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్డౌన్ సడలించాలని కేంద్రాన్ని కోరినట్టు వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించడమే అందుకు కారణం.
లాక్డౌన్ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామికవేత్తలు పేదలకు అండగా ఉండాలని విజయసాయిరెడ్డి కోరారు.
మరి విజయసాయి రెడ్డి మాటలను బట్టి చూస్తే కరోనా హాట్ స్పాట్లు ఉన్న ప్రాంతాల్లో పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేసి.. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలతో లాక్ డౌన్ ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అల్టిమేట్ గా కేంద్రం తీసుకునేదే ఫైనల్ అవుతుంది. ఒకవేళ కేంద్రం లాక్డౌన్ ఎత్తివేస్తే అప్పుడు వైసీపీ సర్కారు కూడా అదే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.