దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లాక్ డౌన్ కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి 21 రోజుల  లాక్ డౌన్ విధించారు. ఇక ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. అయితే కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో మరో కొన్ని రోజులు లాక్ డౌన్ పెంచడానికి కేంద్రం సిధ్దమవుతుంది.

 

అయితే ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా విజృంభిస్తుంది. సీఎం జగన్ ఎంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేసినా, ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారితో ఏపీలో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో ఏపీలో కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం కంటే ముందే లాక్ డౌన్ పెంచేశారు. అయితే ఏపీ కేంద్రం నిర్ణయం మీద నడవనుంది.

 

ఇక ఇదే సమయంలో లాక్ డౌన్ రాష్ట్రమంతా కాకుండా హాట్ స్పాట్స్ ఉన్న ప్రాంతాలకు పరిమితమైతే బాగుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆ మేరకు కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. అయితే విజయసాయి ఈ విధంగా రిక్వెస్ట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసుకునేందుకు లాక్ డౌన్ కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.

 

పైగా అకాల వర్షాలకు ఏపీలో వరితో సహా పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉండే మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. వర్షాలకు, ఈదురు గాలులకు మామిడి పంట దెబ్బతింది. దీంతో రైతులకు ఎక్కువ పని పడింది. చేతికందిన పంటలని వెంటనే రైతులు సరఫరా చేయాల్సిన అవసరముంది.

 

అయితే లాక్ డౌన్ వల్ల పంట సరఫరాకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. దీంతో విజయసాయి హాట్ స్పాట్స్ మినహా మిగతా చోట్ల లాక్ డౌన్ లో సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ అన్ని ప్రాంతాల్లో పెట్టినా, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని చోట్ల లాక్ డౌన్ పై సడలింపు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: