ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించేలా కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రభుత్వం నుంచి జస్టిస్‌ వి.కనగరాజ్‌ని ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు మద్రాస్ హైకోర్టు జడ్జిగా కనగరాజ్ పని చేశారు. ద మద్రాస్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కనగరాజ్ 1973 లో మద్రాస్ బార్ కౌన్సిల్ లో సభ్యత్వం పొందారు.
 
రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో నియమించేలా కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం.... కొత్త ఆర్డినెన్స్ ప్రకారం కనగరాజ్ ను నియమించింది. కొత్త ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు ఉద్వాసన పలికిన ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలివిగా ఆయన పదవి పోయేలా చేసింది. కనగరాజ్ మహిళల, వృద్ధుల సంక్షేమం, బాలలు, విద్య, ఇతర కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ లో ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, జీత భత్యాలు, ఇతర విషయాల గురించి పేర్కొంది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక వ్యక్తి గరిష్టంగా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్ కు హైకోర్టు జడ్జెస్‌ యాక్ట్‌ 1954 ప్రకారం అలవెన్స్‌లు, జీత భత్యాలు అందుతాయి. 
 
ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను జారీ చేయడంపై రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఎన్నికల కమిషనర్ ను మార్చడం సరికాదని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీపీఐ నేత రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: