లాక్ డౌన్ సమయంలో కూడా దొంగలు దారుణాలకు ఒడిగడుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి నిరంతరం రోడ్లపై కాపలా కాస్తున్నా... దొంగలు మాత్రం తమ చోరీలను యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మహానగరాలలో కొందరు వ్యక్తులు ఉదయం పూట బుద్ధిమంతుల్లాగా ప్రవర్తిస్తూ రాత్రి అవ్వగానే తమ నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నారు. అజ్ఞాత వ్యక్తులను అస్సలు నమ్మకూడదు అని పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినా ముందు వెనకా చూసుకోకుండా చాలామంది అమాయక ప్రజలు అజ్ఞాత వ్యక్తులను పనులలో పెట్టుకొని తమ మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుని అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.


వివరాలు తెలుసుకుంటే... చెన్నై లోని అన్నానగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో చోరీ చేద్దామని ఓ దుండగుడు నిన్న అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో దొంగతనంగా ప్రవేశించాడు. ఈ సందర్భంలోనే అపార్ట్మెంట్ టెర్రస్ మీద ఉన్న ఓ గదిలో ఓ వివాహిత ఒంటరిగా నిద్రించడం గమనించాడు సదరు దుండగుడు. దాంతో కామం తో రగిలిపోయిన ఆ దుండగుడు వెంటనే ఆ వివాహిత తలపై కత్తి పెట్టి తన కామ వాంఛ తీర్చాలంటూ ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన ఆ వివాహిత భయంతో గట్టిగా కేకలు వేయగా... షాక్ అయిన దుండగుడు అక్కడినుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు తన భర్త ని పిలిపించి తిరుమంగళం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... అపార్టుమెంటులోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి... ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఆ యువకుడు అన్నా నగర్ ప్రాంతంలోనే ఉదయం పూట పాలు పోస్తూ తిరుగుతున్న రామకృష్ణన్‌గా గుర్తించారు. ఇప్పటివరకు దొంగతనాలు మాత్రమే చేసిన రామకృష్ణన్ ఒంటరిగా మహిళ కనిపించేసరికి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నా నగర్ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా చోరీలు జరగటంతో వాటిలో ఇతని హస్తం ఉందా అనే అనుమానంతో ప్రస్తుతం రామకృష్ణన్ ని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: