దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విషయమై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ అంశంపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. 

 

కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగింపునకు వస్తుండటంతో.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ప్రధాని మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత సీఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2న జరిగిన కాన్ఫరెన్స్‌లో 14వ తేదీ తర్వాత తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా పునరుద్ధరించడం కుదరదని అప్పుడే స్పష్టం చేశారు. ఇవాళ్టి సమావేశంలో తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకున్నారు.

 

కొవిడ్‌-19 పోరులో భాగంగా తాను 24x7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. మోదీ మాస్క్‌ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అలాగే పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్‌ ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరలతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించింది. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా మోదీ అలాంటి మాస్క్‌ను ధరించినట్లు తెలుస్తోంది.

 

లాక్‌డౌన్ పొడిగింపుపై తెలుగు రాష్ట్రాలు భిన్న ధోరణులు అవలంభిస్తున్నాయి. లాక్‌డౌన్ పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే... షరతులతో సడలించాలని ఏపీ సర్కార్ చెబుతోంది. రెడ్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలించాలని మోడీకి జగన్ సూచించారు. మాల్స్, సినిమాహాల్స్, మినహాయించి నిత్యవసరాలు, వ్యవసాయం...లాంటి వాటికి సడలింపు ఇవ్వాలని కోరారు సీఎం జగన్.

 

చాలా మంది సీఎంలు లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు చూపారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీలకు మాత్రం మినహాయింపునివ్వాలని కోరింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పాటు పొడిగించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోడీని కోరారు. లాక్‌డౌన్‌పై ఒక్కోరాష్ట్రం ఒక్కో విధానం అమలుచేయకుండా.. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు జరిగేలా చూడాలని కేజ్రీవాల్ సూచించారు. కేంద్రంతో సంబంధం లేకుండా ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తే ప్రభావం ఉండదన్నారు కేజ్రీవాల్.

 

పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధానిని కోరారు. ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లకు అనుమతులు జారీ చేయాలని ఆయన కోరారు. దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. చాలా రాష్ట్రాలు కూడా అదే కోరుతున్నాయని తెలిపారు.

 

మరోవైపు తమిళనాడులో కరోనా ప్రభావం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఒడిశా, పంజాబ్‌ తరహాలోనే ఇప్పుడు కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీఎం పళనిస్వామిని కోరారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

దేశంలో మందులకు ఎలాంటి కొరత లేదని.. అవసరమైనంత మేరకు ఉన్నాయని మోదీ భరోసా ఇచ్చారు. అలాగే నిత్యావసరాల్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వైరస్ ను కట్టడి చేయడానికి వచ్చే 2-3 వారాలు చాలా కీలకమన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తేనే.. వైరస్ ను కట్టడి చేయగలమని చెప్పారు. అటు చాలాచోట్ల వైద్యులపై జరిగిన దాడుల్ని ప్రధాని ఖండించారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అటు మార్కెట్లలో రద్దు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని.. అలాగే రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ప్రస్తావిస్తే.. ఇలాంటి సంక్షోభ సమయంలోనే దేశం.. స్వయంసమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: