ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడవడమనేది సహజమైన విషయమే. ఏ విషయమైనా కానీ ఈ రెండు పార్టీలు రాజకీయం చేయకుండా ఉండవు. అయితే టీడీపీ ప్రతిపక్ష పాత్రలో ఉండటంతో మరింతగా వైసీపీపై విమర్శలు చేసే కార్యక్రమం చేస్తోంది. ఇక టీడీపీ చేసే విమర్శలకు వైసీపీ కూడా ధీటు గానే కౌంటర్లు ఇస్తుంది. ముఖ్యంగా వైసీపీలో కీ రోల్ పోషించే రాజ్యసభ సభ్యుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి ప్రతిరోజూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, టీడీపీలపై ఏదొక విమర్శ చేస్తూనే ఉంటారు.

 

ఓ వైపు తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూనే, బాబుని టార్గెట్ గా చేసుకుని సెటైర్లు వేస్తారు. అయితే విజయసాయి విమర్శలు ఎవరు పట్టించుకున్న పట్టించుకోపోయినా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాత్రం ఫోకస్ చేస్తూనే ఉంటారు. విజయసాయి ఎలాంటి విమర్శలు చేసిన వెంటనే వెంకన్న కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఫోకస్ మారదు. కనీసం రోజు భోజనం చేస్తారో తెలియదు గానీ, విజయసాయి చేసే విమర్శలకు, ప్రతి విమర్శ చేయకుండా ఉండరు. ఎప్పుడు ఆయన వెనుక పడుతూనే ఉంటారు. ఇక తాజాగా కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కూడా విజయసాయి ఏం చేస్తున్నారనే దానిపైనే ఫోకస్ పెట్టారు.

 

తాజాగా విజయసాయి ఉత్తరాంధ్రలో కరోనా పై పోరాటానికి విరాళాలు పోగేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇక ఆ కార్యక్రమాల్లో విజయసాయి సామాజిక దూరం పాటించడం లేదని, పైగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని,  వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బహిరంగ లేఖ కూడా రాసేశారు. ఆయన వందల మందితో బహిరంగ సభలు నిర్వహించారని, కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ విధంగా బుద్దా లేఖ రాయడం బట్టి చూస్తే విజయసాయిపై ఎంత ఫోకస్ పెట్టారో అర్ధమవుతుంది. మొత్తానికైతే బుద్దా, విజయసాయి వెనుక పడటం ఆపడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: