హైదరాబాద్ నగర శివార్లలో ఇద్దరు యువతులు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి సుమారు 15 అడుగుల దూరంలో మరో చిన్నారి మృతదేహం లభ్యం అవ్వడం ప్రస్తుతం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజ్ వెనుక ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలోని రెండు చెట్ల కు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతున్నాయని, మరో చిన్నారి మృతదేహం ఆమడ దూరంలో పడి ఉందని జీహెచ్ఎంసీ కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ముగ్గురిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.


ఘటనా స్థలంలో ఆధారాల కోసం వెతకగా... జవహర్ నగర్ పోలీసులకు రెండు గ్లాసులు, మాత్రలు, కూల్ డ్రింక్ బాటిల్స్ లభ్యమయ్యాయి. అయితే దాదాపు 12 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారికి... మరణించిన ఇద్దరు యువతులు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే వీరు ఎవరన్నది కూడా ఇప్పటి వరకు పోలీసులకు తెలియలేదు. అసలు ఎందుకు డంపింగ్ యార్డ్ వద్దకు వచ్చి అనుమానాస్పద స్థితిలో మరణించారో తెలియని పోలీసులు ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు.

 

ప్రస్తుతం జవహర్ నగర్ పోలీసులు డెంటల్ కాలేజీ ప్రాంగణం లో అమర్చిన సిసి కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభం శుభం తెలియని ముగ్గురు ఆడపిల్లలు చాలా దయనీయమైన స్థితి లో విగత జీవులుగా కనిపించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందర్ని కలిచివేస్తోంది. ఒకవేళ ఈ మరణాల వెనుక ఎవరైనా హస్తం ఉందని తెలిస్తే వారికి కఠిన శిక్ష విధించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ ముగ్గురు మరణాల వెనుక కారణమేంటో అతి త్వరలో నే తెలుసుకొని మీడియా కి వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: