ప్రస్తుతం కరోనా వైరస్ అందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది. కంటికి కనిపించని శత్రువు ఎటు నుండి దాడి చేసి మృత్యు ఒడిలోకి నెడుతుందో అనే ప్రాణ భయంతో బతుకుతూ ఉన్నారు అందరూ. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ మహమ్మారి భయంతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. అటు రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం కూడా పెరుగుతుండడంతో... ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది . పక్కన ఉన్న వారు కాస్త తుమ్మినా దగ్గినా బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. సొంత వారినైనా సరే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు... ఎంతో దూరం గా ఉంటున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ముంబై లోని ఓ హోటలో పని చేసుకుంటున్న యువకులు లాక్ డౌన్ కారణంగా 14 రోజులపాటు 1,600 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. హమ్మయ్య ఇంటికి చేరుకున్నాం ఇక హాయిగా ఉండవచ్చు అని ఆనందపడే లోపే .. వారికి మరో షాక్ తగిలింది. వారిని తల్లి ఇంట్లోకి రానివ్వలేదు. వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ వారణాసిలో సప్త సాగర్ కు చెందిన అశోక్ కేసరి ముంబైలోని నాగపడ ప్రాంతంలో హోటల్లో పని చేస్తూ ఉంటాడు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగా.. ఇలాంటి సమయంలో ఇంటికి రావాలని అనుకున్నాడు. కానీ ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన వచ్చేందుకు నిర్ణయించుకున్నారు.
దీంతో తన ఆరుగురు స్నేహితులతో కలిసి 14 రోజులపాటు 1,600 కిలోమీటర్లు నడిచి సొంతూరు చేరుకున్నాడు. కానీ అక్కడ అశోక్ తల్లి మాత్రం తలుపు తెరవలేదు. అశోక్ ఎక్కడ కరోనా బారిన పడ్డాడో అంటూ తల్లి భయపడింది. ఇక ఈ విషయం ఇన్స్పెక్టర్ వరకు వెళ్లడంతో... ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చారు... ఆస్పత్రిలో అశోక్ కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా ఇంట్లో ఉండడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు.