కరోనాతో ప్రపంచం మొత్తం అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లిం దేశం, మన పొరుగున ఉన్న పాకిస్థాన్లో కరోనా లాక్డౌన్ అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. 20 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన పాకిస్థాన్లో మత పెద్దల హవా నడుస్తుంది. మతపరమైన పార్టీలు ఎన్నికల్లో గెలవనప్పటికీ మతపరమైన విషయాల్లో జనాలను రెచ్చగొట్టడం చేస్తుంటాయి. దీంతో దేవుడు మనతో ఉన్నాడు అనే ధీమాతో చాలామంది నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు.
పాకిస్థాన్లోని 60 శాతం కరోనా కేసులు మతపరమైన కార్యక్రమాల కారణంగా వ్యాపించినవే. అయినప్పటికీ, మసీదులకు ఎలాంటి మాస్కులు, జాగ్రత్తలు లేకుండానే జనాలు వస్తున్నారు. పశ్చిమ దేశాల వారికి సోకినట్టుగా మాకు ఈ వైరస్ సోకదని మసీదు పెద్ద చెప్పాడని ముల్తాన్కు చెందిన ఓ వ్యక్తి మీడియాకు చెప్పాడు. మేము రోజుకు ఐదు సార్లు ప్రార్థనకు చేతులు, ముఖం కడుక్కుంటాం.. కాఫిర్లు అలా చేయరు.. కనుక మేము భయపడాల్సింది ఏమీ లేదు. దేవుడే మాతో ఉన్నాడు అని ఆయన అన్నారు. పాక్ ప్రధానికి సన్నిహితుడైన ఓ అధికారి దీనిపై మీడియాతో స్పందిస్తూ ``మతం, ప్రార్థన వంటివి పాకిస్థానీయులకు భావావేశంతో కూడిన అంశాలు.. ప్రభుత్వం వీటి విషయంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది`` అని చెప్పడం పరిస్థితికి నిదర్శనం.
ఇదిలా ఉండగా, పాక్ పొరుగు దేశమైన ఇరాన్లో కరోనా మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి బారిన పడి సోమవారం ఒక్కరోజే 111 మంది మృతి చెందగా..కొత్తగా 1,617 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,303కు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో 45,983 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం వరకు 4,585 మంది ప్రాణాలు కోల్పోయారు.