ఇప్పుడు దేశమంతా కరోనా గురించే ఆలోచిస్తోంది. భయపడుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో వైద్య సదుపాయాలు కూడా అంతగా లేవు. మరి కరోనా కాక ఇతర జబ్బులు ఉన్న వారి పరిస్థితి ఏంటి.. ఆసుపత్రులకు వెళ్లే అవకాశాలు కూడా లేవు.. ఈ సమయంలో ఆపద్భందు లా ఆదుకుంటోంది టెలీ మెడిసిన్. కరోనా వైరస్ నియంత్రణ లాక్ డౌన్ నేపద్యంలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడినందున టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచాలని తెలుగు రాష్ట్రాలు ఆలోచించాయి.
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ టెలిమెడిసిన్ ను ప్రారంభించారు. దీనికి వైఎస్ ఆర్ టెలి మెడిసిన్ అని పేరు పెట్టారు. దీని కోసం 14410 టోల్ ఫ్రీ నెంబర్ కూడా కేటాయించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రజలకు వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు మందులు ఇచ్చే ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కారు.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తో కలసి నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో సమగ్ర టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ కన్సల్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును శ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. కలెక్టర్ దాసరి హరిచందనకు ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేస్తూ శ్రీకారం చుట్టారు.
తెలంగాణలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను అందించేందుకు టెలీ మెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ మండలంలో 39 గ్రామాలు ఉండగా.. అందులో ఇదివరకు 17 గ్రామాల్లో సేవలు కొనసాగుతున్నాయి. ఇక్కడ విజయవంతం అయితే తెలంగాణ అంతా విస్తరిస్తారు.