తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 592కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ప్రజా రవాణా స్తంభించింది. లాక్ డౌన్ వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మాత్రమే హైదరాబాద్ నగరంలో రోడ్లపై తిరుగుతున్నాయి. వాహనాలు నిలిచిపోవడంతో ఏదైనా కారణం వల్ల ఆస్పత్రులకు వెళ్లే వాళ్లు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మహేంద్ర ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థకు అనుమతులు ఇచ్చింది. 
 
నేటి నుంచి నగరవాసులకు అత్యవసర సేవల కోసం ఉచిత క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. చిన్నారులు, గర్భతులు, వృద్ధులు అత్యవసర వైద్య సహాయం నిమిత్తం కాల్ చేసి ఉచిత క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఏడు క్యాబ్ ల ద్వారా 24 గంటల పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
నగర వాసులు క్యాబ్ సేవల కోసం 8433958158 నంబర్ కు కాల్ చేయాలని సంస్థ ప్రతినిధులు సూచించారు. సీపీ అంజనీ కుమార్ ఉచిత సేవలు అందిస్తున్న సంస్థను అభినందించారు. నగవాసులు సంస్థ అందిస్తున్న క్యాబ్ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 103 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు.  మరోవైపు ఏపీలో ఈరోజు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో 473కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: