తెలంగాణ లో కరోనా విస్తృతం అవుతోన్న నేపధ్యం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) పేదలకు కోటి మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించింది . కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే . రాష్ట్రం లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుండడం తో , ఇంట్లో కూడా మాస్కులను ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది . లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలకు మాస్కుల పంపిణీ చేసి ఆదుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది .
ఇప్పటికే పెద్ద ఎత్తున శానిటైజర్లను దిగుమతి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం , మాస్కులను సొంతంగా తయారీ చేయడానికి కసరత్తు చేస్తోంది . దీని కోసం పార్టీ మహిళా కార్యకర్తలను , డ్వాక్రా గ్రూప్ ల మహిళల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది . రాష్ట్రం లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం లక్ష మాస్కులకు తక్కువ కాకుండా పేదలకు పంపిణీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కేవలం మాస్కులనే కాకుండా రక్త నిల్వల పై కూడా రాష్ట్ర కమలదళపతి సంజయ్ దృష్టి సారించారు . కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం లో రక్తం నిల్వలు తగ్గిపోవడం , రక్తం కొరత విపరీతంగా ఏర్పడడం తో యువమోర్చా ఆధ్వర్యం లో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు .
లాక్ డౌన్ నేపధ్యం లో ఇతరులు ఎవరు ముందుకొచ్చి రక్తదానాన్ని చేసే పరిస్థితి లేకపోవడం తో , యువమోర్చా కార్యకర్తల ద్వారా రక్తదాన సేకరణ చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది . ప్రతి నియోజకవర్గ కేంద్రం , మండల కేంద్రాల్లో యువమోర్చా ఆధ్వర్యం లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలను చేస్తోంది .