కరోనా ప్రభావంతో అనేక రంగాలు కుదేలవుతున్నాయి. నష్టాలు నమోదు చేస్తున్నాయి. మరి ఎవర్ గ్రీన్ గా ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతోంది. సహజంగా భూమి మీద పెట్టుబడి పెడితే నష్టం ఉండదని మన పెద్దలు చెబుతారు. అందుకే కాస్త డబ్బు జమ కాగానే ఎక్కడైనా సలం కొందామని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. నమ్మకమైన లే అవుట్లలో తీసుకుంటే ఇబ్బంది ఉండదని భావిస్తారు.
అందులోనూ భూమి రూపంలో పెట్టుబడి పెట్టుబడి నమ్మకమైంది.. లాభామైంది.. ఎవరూ దోచుకుపోయే వీలు లేనిదన్న నమ్మకం ఎక్కువ. మరి ఈ రంగంపై కరోనా ప్రభావం ఎలా ఉంటుంది. ఇదే అంశంపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఏమంటున్నారంటే.. కరోనా వైరస్ ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందట. దీని ప్రభావంతో రియల్ ఎస్టేట్ ధరలు 20 శాతం తగ్గుతాయని ఆయన అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే.. తక్కువ డిమాండ్, ఇన్వెంటరీ యూనిట్లు కారణంగా ఇప్పటికే రియల్టీ రంగం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ , కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంఘాలతో వీడియో సమావేశంలో డెవలపర్లను ఉద్దేశించి హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ మాట్లాడారు.
అంతే కాదు.. ఆయన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. రియల్టీ ఖాతాల పునర్వ్యవస్థీకరణ కోసం ఎన్పీఏ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఖాతా 90 రోజుల పాటు సర్వీస్ చేయకపోతే అది ఎన్పీఏగా మారిపోతుంది. అందుకే దీన్ని కనీసం 180 రోజులకు పొడిగించాలని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.