పొట్ట చేతిలో పట్టుకొని వచ్చిన పట్టణంలో ఉపాధి లేక...కాలుతున్న కడుపులతో ఉండలేక దేశవ్యాప్తంగా నగరాల్లోని కూలీలు సొంతూళ్లకు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరికంటే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పనిచేసే వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పూటగడవక తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. అటు సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ పొడిగించడం వల్ల ఈ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. రవాణా సౌకర్యం లేక కొంత మంది కూలీలు కాలి నడకన తమ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి చేసిన సూచన ఫలిస్తే...నిజంగా ప్రజలు చేతులు ఎత్తి మొక్కే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
కరోనా కారణంగా లాక్డౌన్ వల్ల దేశం అంతి స్తంభించింది. పనులు ఆగిపోవడంతో వలస కార్మికులు ఉపాధి లేక ఉసూరుమంటున్నారు. మంగళవారం మహారాష్ట్రలోని ముంబై, థానేలో వలస కూలీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్కు వెళ్లేందుకు ట్రైన్లు నడపాలని డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు వాళ్లపై లాఠీ చార్జ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని 1000 మంది వలస కూలీలపై కేసు నమోదు చేశారు. ఇలా వలస కార్మికుల కష్టాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఆలోచనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని అనుకూలంగా మలచుకుని రహదారుల అభివృద్ధికి నడుం బిగించాలని గడ్కరీ భావిస్తున్నారు. ఇలా చేస్తే ఉభయతారకంగా ఉంటుందని ఆయన ఆలోచన చేస్తున్నారు. రోడ్ల పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయవచ్చు. వలస కార్మికులకు ఉపాధి కల్పించవచ్చని కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారు. హైవే పనులు ప్రారంభించడంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరహుగుతున్నాయని కేంద్రమంత్రి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు గడ్కరీ వెల్లడించారు. వలస కార్మికులను ఉపయోగించి సత్వరం రోడ్ల పనులు చేపట్టడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వలస కూలీలను తమ సొంత ఊళ్లకు తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సాయంతో ఆయా రాష్ట్రాలు తీసుకోవాలన్నారు. బస్సుల ద్వారా కూలీలను తరలించాలని ఆయన సూచించారు. 500 కి.మీ కంటే ఎక్కువ దూరమున్న ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా కూలీలను తరలించాలన్నారు.