చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుుడు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఆయన విజ్ఞప్తి నిజంగా ఆలోచింపజేసేదే. ఆయన ఏమంటున్నారంటే.. “ మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానం పిలుపు విని ఇన్నేళ్లుగా ఇంతమంది ముందుకొచ్చారంటే అన్నయ్య చలువే. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్.. నినాదంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులకు రక్త దాతల కొరత తీవ్రంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమంటున్నారంటే.. ప్రభుత్వాల నిర్ణయంతో కరోనా లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకులు అన్నీ లాక్ అయిపోయాయి. రక్త దాతలు ఇంటికే పరిమితం అయిపోవడం వల్ల ఎక్కడా రక్తం దొరకడం లేదు. ముఖ్యంగా తలసిమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం బ్లడ్ అందాల్సి ఉండగా.. రక్తం దొరకక క్లిష్ఠ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఎందరో ఆపరేషన్లు జరగక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అంపశయ్యపై ఉన్నారని రమణం స్వామినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా చోట్ల రక్తం లభ్యం కాక డాక్టర్లు ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు. అందుకే అందరూ ముందుకొచ్చి పోలీస్ వారి సహకారంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి విచ్చేసి రక్తదానం చేయండి. మీ సమీపంలోని ఏదైనా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేయండి అని పిలుపు ఇస్తున్నారు.
నిజమే.. చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుుడు లేవనెత్తిన అంశం చాలా ముఖ్యమైంది. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల పరిస్థితి రక్తం దొరక్కపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఎందరో పసి పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఈ లాక్డౌన్ సమయంలో రక్తం అందక విలవిల్లాడతారు. ఈ సమస్యపై ప్రభుత్వం కూడా తగిన చొరవ చూపాలి. ఈ సమస్యను పరిష్కరించాలి.