ఇప్పుడంతా కరోనా జపమే. కొందరి అజాగ్రత్త వల్ల , అవగాహన లేకపోవడం వల్ల దీని వ్యాప్తి పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు అట్టుడికి పోతున్న పరిస్థితి. దేశాలు దేశాలు కుదేలు అవుతున్నాయి. కొన్ని దేశాల్లో శవాల గుట్టలు ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరి దృష్టి ఎలా ప్రాణాలు కాపాడుకోవడం అనే దానిపైనే పడింది. ఇప్పటికీ మన వద్ద కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఏమైనా అవకాశం ఉందా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అయితే అవకాశం ఉంది. ఇదిగో కొన్ని ఉదాహరణణలు, కొన్ని సందర్భాలు.
హైదరాబాద్ సమీపంలోని సూర్యాపేట జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 14 మందికి వైరస్ సోకింది. అలాగే ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరులో ఆరేళ్ల బాలుడికి, తిరుమలగిరిలో ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరుకుంది.
ఢిల్లీలో ఓ పిజ్జా బాయ్ నిర్వాకం వల్ల 72 కుటుంబాలు క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. సౌత్ ఢిల్లీలో పిజ్జా డెలివరీ బోయ్ ద్వారా 72 ఇళ్లకు కరోనా వైరస్ పాకినట్లు అనుమానిస్తున్నారు. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. మాలవీయ నగర్ ఏరియాలో ఉన్న ప్రముఖ పిజ్జా సెంటర్ నుంచి డెలివరీ చేస్తున్న ఒక బోయ్ని పరీక్షించగా అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో అతనితోపాటు 16 మంది డెలివరీ కుర్రాళ్లను కూడా క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత అతని ద్వారా ఎన్ని ఇళ్లకు పిజ్జా డెలివరీ జరిగిందో చెక్ చేసి, అన్ని ఇళ్లవారిని హెచ్చరించారు. ‘మొత్తం 72 ఇళ్లకు ఆ పిజ్జా అవుట్లెట్ నుంచి డెలివరీ జరిగినట్లు గుర్తించాం. వారిని ఇళ్లు దాటి బయటకు రాకుండా సెల్ఫ్ క్వారంటైనులోనే ఉండి జాగ్రత్తలు తీసుకోమన్నాం’ అని కలెక్టర్ బి.ఎం.మిశ్రా తెలిపారు. దీంతో గాబరా పడాల్సిందేమీ లేదని, డెలివరీ చేసేవాళ్లంతా ముఖానికి మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా ఉన్నట్లుగా గుర్తించిన డెలివరీ బోయ్ ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇలా కరోనా ఏ వైపు నుంచి, ఎవరి ద్వారా వస్తుందో తెలియడం లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.