దేశంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే మొదటి నుంచి దేశంలో ఆంధ్రప్రదేశ్ లో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తక్కువనే చెప్పాలి. మొదట్లో ఈ సంఖ్య ఇంకా చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ఏపీలో కరోనా కేసులు గతంలో పోలిస్తే చాలా ఎక్కువగా బయటపడే అవకాశం కనిపిస్తోంది.
ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య బాగా పెరుగుతోంది. దీనికి తోడు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేసేందుకు లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సీఎం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తిస్తారు.
కొత్తగా లక్ష ర్యాపిట్ కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించున్నాయి. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగించనున్నారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నారు.
దీని వల్ల కరోనా టెస్టుల సంఖ్య గణనీయంగా ఏపీలో పెరిగే అవకాశం ఉంది. టెస్టుల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిగ్గా కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సు కనిపిస్తోంది. అయితే టెస్టులు తక్కువ చేసుకుని కరోనా కేసులు చాలా తక్కువ ఉన్నాయని మురిసిపోయే కంటే.. ఇలా టెస్టులు ఎక్కువ చేయించుకని కరోనా సంగతేంటో తేలిస్తేనే మంచిదంటున్నారు నిపుణులు.