కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండగా , ఈ నెల 20 వ తేదీ నుంచి లాక్ డౌన్ ను దశలవారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది . అయితే దశల వారీగా లాక్ డౌన్ సడలించే అంశం పై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువరించకముందే , కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది . కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రాంతాలల్లో ఉన్న కేసుల ఆధారంగా ఆరెంజ్ -ఏ , ఆరెంజ్ -బి , గ్రీన్ జోన్లుగా గుర్తించింది .
ఆయా జోన్లలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రకటించింది . రెడ్ జోన్ ఏరియా లో లాక్ డౌన్ యధావిధిగా కొనసాగుతుందని , నిత్యావసరాల కొనుగోలు కోసం మాత్రం ఆయా ప్రాంతాల్లో రెండు మార్గాలను తెరిచి ఉంచనున్నట్లు వెల్లడించింది . ఇక మిగతా ప్రాంతాల్లో సరి , బేసి విధానం లో ప్రయివేట్ వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు పేర్కొంది . రెస్టారెంట్లను రాత్రి ఏడుగంటల వరకు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది . ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ జోన్ పరిధి లో దేశీయ , అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేదించింది .
రైళ్లు , మెట్రో రైళ్లను మూసి వేసింది . సినిమా హాళ్లు , మాల్స్ మూసివేయడం తో పాటు , షాపింగ్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్ ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది . ఇక రాజకీయ , మతపరమైన సమావేశాలను నిషేదించింది . పెళ్లిళ్లు, అంత్యక్రియలకు కేవలం 20 మందికి హాజరుకావద్దని ఆదేశించింది . కేరళ తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల 20 వ తేదీ నుంచి లాక్ డౌన్ సడలించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి .