ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వైరస్ని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ప్రకటించాయి. ఎక్కడివారు అక్కడే ఇళ్ళకి పరిమితమయ్యేలా చేసింది ఈ వైరస్. అయినా, రోజూ కరోనా కేసుల్లో పెరుగుదల ఉంటున్న వేళ ప్రజలకు అందే కొన్ని నిత్యవసర సేవలు కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ఈ జాగ్రత్త చర్యల్లో భాగంగానే వంట గ్యాస్ సరఫరా చేసే సంస్థలు ఇళ్లకు సిలిండర్ల డెలివరీలో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి.
అదేమిటంటే... వంట గ్యాస్ కావాల్సిన వారు సిలిండర్ బుక్ చేశాక డెలివరీ బాయ్ నేరుగా ఇంటి ముందుకు వచ్చి మరీ లేదా లోపలకు వచ్చి గ్యాస్ సిలిండర్ ను మనకు అందించడం జరిగేది. అయితే తాజాగా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇకపై అలా కుదరదు. ఇంటి గేటు వరకే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వస్తాడని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డీలర్ల సంఘం ప్రకటించింది. కరోనా వైరస్ ధాటికే వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో ఈ స్వల్ప మార్పు చేసినట్టు తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఈ విధానాన్నే ఖరారు చేసింది.
ఈ కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న క్రమంలో భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరమని చెబుతున్నారు. ఈ విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ చీఫ్ ఆర్.శ్రావణ్ రావు దీని పై స్పందించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్క సిబ్బంది రక్షణ కొరకే ఈ నిర్ణయం ఈ తీసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.