కరోనా వైరస్ ఆల్కహాల్ కారణంగా చనిపోతుందా.. ఇది కొంత వరకూ వాస్తవమే. ఎందుకంటే కరోనా వైరస్ ఆల్కహాల్లో బతకదు. అందుకే మనం మన చేతులకు అంటిన కరోనాను చంపేందుకు, చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నాం. ఈ శానిటైజర్లలో ఎక్కువగా ఉండేది ఆల్కహాలే.
అయితే కరోనా వైరస్ ను ఆల్కహాల్ చంపినంత మాత్రాన.. ఆల్కహాల్ తాగితే మనలోని కరోనా నశిస్తుందనేది ఒట్టి భ్రమ మాత్రమే. మనకు కరోనా సోకితే అది మన చేతులపైనే ఉపరితలంపైనో ఉండిపోదు. అది మన కళ్లు, చెవులు, ముక్కు, నోరు ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అక్కడ తిష్ట వేసుకుంటుంది. అలాంటిప్పుడు మనం ఆల్కహాల్ తాగినా ఏమాత్రం ఉపయోగం ఉండదు.
ఇలాంటి పిచ్చి కబుర్లు నమ్మి విదేశాల్లో ఆల్కహాల్, మిథనాల్ వంటి రసాయనాలు తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇలాంటి వార్తలు అస్సలు నమ్మొద్దు. కొందరు తెలియక ఇలా సమాచారం వ్యాప్తి చేస్తుంటే.. మరికొందరికి ఇది ఓ శాడిస్టిక్ అలవాటుగా మారింది. ఇక కరోనా వంటి కష్టకాలంలో ఇలాంటి పుకార్లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఇలాంటి పుకార్లపై సమాచారం ఇస్తోంది.
సోషల్ మీడియా ద్వారా నిత్యం అనేక కోట్ల వార్తలు అటూ ఇటూ చక్కర్లు కొడుతుంటాయి. అందులో చాలా వరకూ ఫేక్ ఉండటం ఇప్పుడు పెద్ద ప్రమాదకంగా మారింది. తెలిసీ తెలియక కొందరు.. కావాలని కొందరు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారు.