నటిగా, ఎమ్మెల్యేగా, జబర్దస్త్ జడ్జీగా, ఏపీఐఐసీ ఛైర్మన్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజాకు తాజాగా సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ఆమె చేసిన ఒక పనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నగరిలోని ఒక గ్రామంలో తాగునీటి సమస్యకు రోజా పరిష్కారం చూపడంతో గ్రామ ప్రజలు ఆమెకు పుష్పభిషేకం చేశారు.
ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని నిబంధనలు ఉన్నా ఆ గ్రామంలో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి పుష్పాభిషేకం చేశారు. ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పూలు జల్లించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసి సీఎం జగన్ కూడా సీరియస్ గా ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న సమయంలో రోజా వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు నగరి నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలులో రోజా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని... జిల్లా మంత్రులకు, ఇతర నాయకులకు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నాయి.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో టీడీపీ సోషల్ మీడియా వేదికగా రోజాపై విమర్శలు చేస్తోంది. రోజా ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు సామాన్యులకు మాత్రమే అనేలా వ్యవహరిస్తున్నారని.... వైసీపీ నేతలు ఇష్టానుసారం వాళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. మరి వైరల్ అవుతున్న వీడియోపై రోజా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
కరోనా గురించి సమాజహితులు చెప్పే జాగ్రత్తలన్నీ సామాన్య ప్రజలకేగానీ మాకెందుకు? మేము అపార మేధావులం, పైగా వైసీపీ నేతలం, కరోనా మమ్మల్ని ఏమీ చేయలేదు.. అన్నట్టు వైసీపీ నేతలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.. కానీ ప్రజలనెందుకు బలిపెడుతున్నారు రోజాగారు? pic.twitter.com/BWSmRC0MnH
— telugu desam party #StayHomeSaveLives (@JaiTDP) April 21, 2020