కరోనా కేసులు భారతదేశంలో తగ్గుముఖం పడుతున్న సమయంలో…మర్కజ్లో మత ప్రార్థనలు సంచలనం సృష్టించాయి. దేశ నలుమూలల నుంచి ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో చాలా రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మర్కజ్ మత ప్రార్ధనల్లో పాల్గొన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు పిలుపు ఇచ్చాయి. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యహరిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒకరి ద్వారా పదుల సంఖ్యలో వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మర్కజ్కు వెళ్లి వచ్చిన వారి సమాచారం ఇస్తే 10 వేల రూపాయలను రివార్డ్ గా ఇస్తామని ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది నిజామూద్దీన్ వెళ్లి వచ్చి రహస్యంగా తల దాచుకుంటున్నారని అందుకే ఈ బహుమానం ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చాలా మంది మర్కజ్ వెళ్లి వచ్చిన విషయం దాచాలని చూస్తున్నారని, కానీ వివరాలు తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడిచిన మూడు రోజుల్లో కాన్పూర్లో కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ 74 కేసులు నమోదు కాగా.. వీటిలో ఎక్కువగా ఢిల్లీ మర్కజ్ మత సమావేశాలతో లింక్ ఉన్నవారని తెలిపారు.
ఇదిలాఉండగా, కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను కఠినంగా పాటించాలని, దీనిని విజయవంతం చేసేందుకు తన తండ్రి అంత్యక్రియలకు సైతం వెళ్లడం లేదని చెప్పారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తండ్రిని ఆఖరి చూపు చూడాలని ఉన్నా 23 కోట్ల మంది ప్రజల క్షేమం దృష్ట్యా కరోనాపై పోరాటంలో తన కర్తవ్యానికి కట్టుబడి ఆగిపోతున్నానని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.