ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం కాదు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మామూలుగా కరోనా వైరస్ ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తే... వారికి కరోనా వైరస్ ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి వెంటనే టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పొడి దగ్గు, జ్వరం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా వైరస్ లక్షణాలు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేవలం జలుబు పొడి దగ్గు జ్వరం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు మాత్రమే వైరస్ లక్షణాలు కాదని మరో 12 లక్షణాలు కూడా కరోనా వైరస్ సోకిన వారికి ఉంటాయి అంటూ తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ లక్షణాలలో ఏ లక్షణం ఎంతమేరకు మనిషి శరీరంపై ప్రభావం చూపుతుంది అనే దానిపై కూడా ఆసక్తికర నిజాలను వెల్లడించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కరోనా వైరస్ కారణంగా మానవ శరీరంపై 88 శాతం మందికి జ్వరం వస్తుందని... అలాగే 68 శాతం మందిలో పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయని... 38 శాతం మందిలో అలసట లాంటి లక్షణాలు... 33 శాతం మందిలో శ్లేష్మ దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
వీటితో పాటు 19 శాతం మందిలో శ్వాస సమస్య, 15 శాతం మందిలో కండరాల నొప్పి, 14 శాతం మందిలో గొంతునొప్పి తలనొప్పి, 11 శాతం మందిలో చలి గా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. అంతేకాకుండా 5 శాతం మందిలో వికారం ముక్కులో ఇబ్బంది ఉండడం లాంటి లక్షణాలు కనిపించడంతో పాటు నాలుగు శాతం మందిలో విరేచనాలు కూడా కనిపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అని తెలిపింది. ఈ 14 లక్షణాలలో ఏవైనా రోజుల రోజుల తరబడి ఇబ్బంది పెడుతున్నా వెంటనే కరోనా వైరస్ ఆధారిత పరీక్షలు చేయించుకోవాలని సూచించింది..