కరోనా వైరస్పై పోరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడువడం లేదు. ఐకమత్యమే మహాబలం అనే భారతీయ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోతున్నాయి. ఈ దారుణ విపత్తును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కటిగా నిలబడుదాం.. అనే విషయాన్ని పక్కనపడేసి ఇందులోనూ రాజకీయాలను వెతుక్కునే పనిలో పడుతున్నాయి. లాక్డౌన్ అమలు విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే.. పలు రాష్ట్రాలు మరో నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. ఈ ధోరణి మొదటి నుంచీ కనిపిస్తోంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా.. లాక్డౌన్ సడలింపుల విషయంలోనూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిణామాలు భారత్ను దారుణమైన విపత్కర పరిస్థితుల్లోకి నెడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో కరోనా కల్లోనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న భిన్నమైన పోకడలే కారణమవుతాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ను విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడువు దగ్గరపడుతున్న క్రమంలో పంజాబ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, తదితర రాష్ట్రాలు కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్డౌన్ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించాయి. ఆ తర్వాత ఏప్రిల్ 14న ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా.. లాక్డౌన్ అమలులో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు ఉంటాయని, ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏకంగా మే 7వ తేదీ వరరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. గోవా, మణిపూర్ రాష్ట్రాలు కరోనా రహిత రాష్ట్రాలు మారాయంటూ ముఖ్యమంత్రులు ప్రకటించుకున్నారు.
ఇక కేంద్రానికి, పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి తీవ్ర వాగ్వాదమే జరుగుతోంది. కేంద్ర బృందాలను రాష్ట్రంలోకి అనుమతించలేదు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ పరిణామాలన్నీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని, ఇది కచ్చితంగా దేశంలో కరోనా కల్లోనాని దారితీస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో కూడా ఇలా వ్యవహరించడం వల్లే ఇప్పుడక్కడ దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని.. ముందుముందు భారత్లోనూ అంతటి విపత్కరపరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో లాక్డౌన్ను ఒకేతీరుగా దేశమంతా కఠినంగా అమలు చేయకుంటే.. వచ్చే సెప్టెంబర్ నాటికి ఏకంగా 111కోట్ల మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్, డైనమిక్స్ అండ్ ఎకనామిక్ పాలసీ తన నివేదికలో పేర్కొంది. సగటున 55 కోట్ల నుంచి దేశ జనాభా మొత్తం కరోనా బారిన పడే ప్రమాదం పొంచి వుందని వెల్లడించింది. ప్రస్తుతం వైరస్ సోకినప్పటికీ రోగుల్లో లక్షణాలు కనిపించకపోవటం పెద్ద సమస్య అని, ఇది ఇప్పుడు భారత్ 80శాతానికిపైగా ఉందని పేర్కొంది. అలాగే.. భారత దేశంలో కరోనా వైరస్ కేసులు పెద్ద మొత్తంలో పెరిగే ప్రమాదం ఉందని చైనాకు చెందిన వైద్య నిపుణుడు, కొవిడ్-19 విశ్లేషకుడు, హౌషాన్ దవాఖాన డైరెక్టర్ వెన్హాంగ్ హెచ్చరించారు. చైనాలో విధించిన 100 శాతం లాక్డౌన్ అన్ని దేశాలు పాటిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.