దేశవ్యాప్తంగా కరోనరా కలకలం కొనసాగుతోంది. ప్రజల్లో ఈ మహమ్మారి భయాలు ఇంకా వీడిపోవడం లేదు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని కరోనా రోగి అని అనుమానించి అతనిపై తీవ్రంగా దాడి చేసి చంపారు. కల్యాణ్ పట్టణానికి చెందిన గణేష్ గుప్తా నిత్యావసర సరుకుల కోసం బుధవారం ఉదయం బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న మార్గంలో పోలీసులు కనిపించేసరికి వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గంలో వెళ్తున్న గణేష్ గుప్తా ఒక్కసారి దగ్గాడు. దీంతో అక్కడున్న కొంతమంది.. గుప్తాను కరోనా రోగి అనుమానించి తీవ్రంగా దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గుప్తా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇదిలాఉండగా, దేశ రాజధాని ఢిల్లీలోని ఆసియాలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన అజాద్పూర్ మండీలో ఆసక్తికర పరిణామం జరిగింది. అజాద్పూర్ మండీలో పండ్లు, కూరగాయల వ్యాపారం చేస్తున్న 57 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్తో మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అజాద్పూర్ మండీలోని 300 దుకాణాలను మూసివేయించారు. కరోనాతో చనిపోయిన వ్యక్తిని కలిసిన 17 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఒకరు వ్యాపారి మేనల్లుడు కాగా, మిగతా వారు అతని వద్ద పని చేస్తున్న కూలీలు. ఏప్రిల్ 14న వ్యాపారి రక్త నమూనాలను సేకరించారు. ఏప్రిల్ 21న ఆయన కరోనాతో చనిపోయాడు. అజాద్పూర్ మండీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా, అజాద్పూర్ మండీని లాక్డౌన్ కారణంగా మూసివేసినప్పటికి.. వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే మండీని తెరిచారు. ఎక్కువగా పండ్లు, కూరగాయల వ్యాపారం జరుగుతుంది. అయితే ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపారులకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పండ్లు, కూరగాయాలు తీసుకువచ్చే ట్రక్కులను అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో ఈ ఘటరన జరగడం గమనార్హం.