ఇప్పుడంతా కరోనామయమే. ప్రతి నిర్ణయం కరోనా వల్ల ప్రభావితం అవుతోంది. ఈ ఒరవడిలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో ఊహించని ఆర్డర్ వచ్చింది. కరోనాకు కేరాప్ అడ్రస్ అయిన వుహాన్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు నియంత్రణలోకి రావటంతో లాక్డౌన్ను సడలించిన విషయం తెలిసిందే. చాలారోజుల తర్వాత బయటకొచ్చిన జనం ఆ స్వేచ్చను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో కొందరు శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు. దీంతో సహజంగానే కరోనా రెండోసారి పంజా విసురుతుండటంతో అక్కడి ప్రభుత్వం ప్రజల నడతపై కఠిన ఆంక్షలు విధించింది.
ప్రస్తుతం ప్రజలు ముఖానికి మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముఖానికి చేతిని అడ్డుపెట్టకోవాలని ప్రభుత్వం పదేపదే చెప్పినా పట్టించుకోవటంలేదు. దాంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. చైనా రాజధాని బీజింగ్లో బీజింగ్ బికినీ పేరుతో నగరంలో పురుషులు తమ పొట్టలు కనిపించేలా చిన్నచిన్న టీషర్ట్లను ధరించటం అలవాటుగా మారింది. బీజింగ్ మున్సిపల్ అధికారులు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. బయట తిరిగే ఎవరైనా మఖానికి మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని లేదంటే భారీగా జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బయటకు వెళ్లినప్పుడు వేసుకొనే బట్టలు కూడా శుభ్రంగా ఉండాలని సూచించింది. ఇలాంటి బట్టలు వేసుకొని బయటకొస్తే కఠిన చర్యలు ఉంటాయని బీజింగ్ మున్సిపల్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలాఉండగా, చైనా జాతీయ ఫార్మాస్యూటికల్ గ్రూప్ (సినోఫార్మ్), వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నేతృత్వంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్ కరోనా వైరస్పై పోరాడేందుకు మూడో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ చైతన్య రహితమైనది. వైరస్ కణాలు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారక సూక్ష్మజీవులు (ప్యాథోజెన్స్)ను కలిగి ఉన్న వ్యాక్సిన్ను చైతన్య రహితమైనదిగా పేర్కొంటారు. ఇవి వ్యాధికారక శక్తిని కోల్పోయి ఉంటాయి. అయితే, ప్రత్యక్ష వ్యాక్సిన్లో బతికున్న ప్యాథోజెన్స్ ఉంటాయి. వ్యాక్సిన్కు సంబంధించి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ (మానవులపై వ్యాక్సిన్ పరీక్షలు)కు చైనా అనుమతినిచ్చింది. 96 మందిపై తొలిదశ క్లినికల్ ట్రయల్స్ను ఏప్రిల్ 23న ఆరంభించామని, ఆ ప్రయోగాల్లో వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని సినోఫార్మ్ తెలిపింది.