దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనాపై రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ, టీడీపీ నేతలు ప్రతిరోజూ మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం సోషల్ మీడియా వేదికగా బాబు అండ్ బ్యాచ్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీలు కుదిరితే నాలుగైదు పంచ్లు కూడా వేసేస్తున్నారు. ఈయన డైలీ బాబుపై విమర్శలు చేయకుండా అయితే ఉండటం లేదు.
ఇక విజయసాయికి వెంటనే కౌంటర్ ఇచ్చే నేతల్లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ముందున్నారు. అసలు సోషల్ మీడియాలో విజయసాయి సెటైర్ వేయడం ఆలస్యం, వెంటనే బుద్దా దానికి కౌంటర్ ఇచ్చేస్తారు. ఇక ఎన్ని కౌంటర్లు ఇచ్చినా, విజయసాయి మాత్రం వెనక్కి తగ్గకుండా బాబుపై పంచ్లు వేస్తున్నారు. తాజాగా కూడా విజయసాయి బాబుపై అదిరిపోయే సెటైర్ వేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను కరోనా హాస్పిటల్కు ఇస్తే తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టవుతుందన్న అభ్యర్థనలు చంద్రబాబుకు వెల్లువెత్తుతున్నాయని, ఇటువంటి క్లిష్ట సమయంలో పెద్ద మనసు కనబర్చాలని, దానివల్ల పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మ కూడా శాంతిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక దీనికి బుద్దా కౌంటర్ ఇస్తూ... హైదరాబాద్లో ఖాళీగా ఉన్న ఇంద్ర భవనం లాంటి లోటస్ పాండ్, బెంగుళూరులో ఖాళీగా ఉన్న యలహంక రాజ ప్రసాదం కరోనా ఆసుపత్రికి ఇవ్వాలని, ఆధునిక వసతులు ఉన్న భవనాలు కావడంతో కరోనా రోగులకు మంచి వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుందని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు.
అయితే టీడీపీ నేతలు ఎన్ని కౌంటర్లు ఇచ్చినా, విజయసాయి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారి కౌంటర్లకు ధీటుగా, రోజూ బాబుపై సెటైర్లు వేస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు చేసే విమర్శలకు చెక్ పెడుతున్నారు. జగన్ ఎక్కువ శాతం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తుంటే, విజయసాయి ప్రతిపక్షాల చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు.