కరోనా ఎఫెక్ట్ కలకలం కొనసాగుతోంది. అన్ని రంగాలు, వర్గాలు, ప్రభుత్వాలు దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో తాజాగా హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్తో రాష్ట్ర ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో వచ్చే ఏడాది పాటు ఎలాంటి కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టబోమని నిర్ణయించింది. దీతో ఆ రాష్ట్రంలో యూత్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
దాదాపు నెలకు పైగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బాగా చితికిపోయాయి. ఖజనా ఖాళీ కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. ఈ సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీని ఆనుకొని ఉన్న రాష్ట్రమైన హర్యానా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు డీఏ నిలిపివేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టకూడదని స్పష్టం చేసింది. లాక్డౌన్ వల్ల రాష్ట్రం ఆర్థికంగా బాగా చితికిపోయిందని..కొత్త ఉద్యోగాలు సృష్టించేంత ఆదాయ వనరులు లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలాఉండగా హర్యానాను ఆనుకొని ఉన్న అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ పెద్దగా లేని ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యక్రమాలు పునఃప్రారంచాలని ప్రభుత్వం భావిస్తోంది. పది అంతకన్నా తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్ పాక్షికంగా సడలించే అంశంపై ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 45 జిల్లాల్లో కరోనా కేసులు పదికన్నా తక్కువే నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో చిన్నతరహా పరిశ్రమలను తిరిగి తెరిస్తే బాగుంటుందని రాష్ట్రంలోని 11 ప్రధాన కమిటీల చైర్పర్సన్లతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, యూపీ సర్కారు నిర్ణయంతో హర్యానా సర్కారు సైతం తమ రాష్ట్రంలో లాక్డౌన్పై పునఃసమీక్ష చేసుకునే అవకాశం ఉంది.