నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడా..? పోయాడా..? ఇప్పుడిదే పెద్ద మిస్టరీగా మారిపోయింది. చనిపోయారని కొందరు... ఇంకా బతికే ఉన్నారని మరికొందరు... ఎవరికీ తోచింది వారు చెబుతున్నారు. కిమ్ ఆరోగ్యంపై భిన్నకథనాలు, అంతకు మించి రూమర్లతో అందర్నీ కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్కడేం జరిగినా క్షణాల్లో పసిగట్టే అమెరికన్ ఇంటెలిజెన్స్ సైతం.. కిమ్ మిస్టరీని ఛేదించలేకపోతోంది. ఇంతకీ కిమ్ మ్యాటర్పై నార్త్ కొరియా సైలెంట్గా ఉండడానికి కారణమేంటీ..?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్కు ఇటీవలే హార్ట్ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆ దేశంలోని అధికార కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆ దేశం ఘనంగా జరుపుకునే కిమ్ తాత జయంతి వేడుకలకు కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో కిమ్ ఆరోగ్యం విషమించిందని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స పొందుతున్నారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
చైనా సైతం కిమ్కు మెరుగైన వైద్యం అందించడానికి డాక్టర్ల బృందాన్ని నార్త్ కొరియాకు పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే.. కిమ్ చనిపోయారని దక్షిణ కొరియాకు చెందిన మీడియా.. కథనాలను ప్రసారం చేసింది. దానికి మద్దతుగా జపాన్ మీడియా కూడా కిమ్ చనిపోయాడని వార్తలను ప్రసారం చేసింది.
ప్రపంచంలోని అన్ని దేశాలు.. కిమ్ చనిపోయాడని అంటున్నా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేస్తున్నారు. కిమ్ ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. అధ్యక్షుడి మాటలకు మద్దతుగా యూఎస్ మీడియా కూడా కిమ్ చనిపోలేదని కథనాలను ప్రసారం చేసింది. కిమ్ తన హాలిడే స్పాట్ అయిన వోన్సన్ రిసార్ట్లో ఉన్నట్లు శాటిలైట్ ఫోటోలను విడుదల చేసింది. కిమ్ అక్కడే ఉన్నారని చెప్పడానికి కొన్ని ఆధారాలను కూడా చూపింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడి ప్రైవేట్ రైలు స్టేషన్లో ఉన్న ఫొటోలను విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 23 మధ్యే కిమ్ అక్కడికి చేరుకున్నారని తెలిపింది. ఆ స్టేషన్కి కిమ్ కుటుంబానికి మినహా ఎవరికీ అనుమతి ఉండదు. కిమ్ మాత్రమే ఆ ట్రైన్ను ఉపయోగిస్తారు. అటువంటి అధ్యక్షుడి ట్రైన్ అక్కడే ఉండటంతో.. కిమ్ ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతోంది అమెరికా.