హైదరాబాద్లో నివసించే చాలా మంది కల అది. నగరం నడిబొడ్డున్నే ఉన్నప్పటికీ....అనుభవించలేని...అలా అని వదిలివేయలేని ఆనందాన్ని గురించిన ఆందోళన. ఇంతకీ అదేంటంటే... హుస్సేన్ సాగర్లోని ట్యాంక్ బండ్ ప్రాంగణాలు. ట్యాంక్ బండ్ అంటే ఎంత అందంగా ఉంటుందో కంపు కొట్టే హుస్సేన్ సాగర్ పరిసరాలు అంతే ఇబ్బందిగా కూడా ఉంటాయి. అయితే, ఇప్పుడు అక్కడ సీన్ మారింది. లాక్ డౌన్ కారణంగా హుస్సేన్ సాగన్ ఊపిరి పీల్చుకుంటోంది. నాలాల నుంచి సివరేజీ, కెమికల్ వ్యర్థాలు ఆగిపోవడంతో శుభ్రంగా మారుతోంది. నురగలు, దుర్వాసన, నాచు తగ్గుతోంది.
సాయంకాలం వేళ కావచ్చు... సెలవుల సమయంలోనూ అయి ఉండవచ్చు ఆహ్లాదం కోసం ట్యాంక్ బండ్కు హైదరాబాద్ ప్రజలు వెళ్తుంటారు. అయితే, అక్కడ ముక్కు మూసుకుంటే కానీ నడవని పరిస్థితి. దీనికి కారణం మురుగు నీరు. హుస్సేన్ సాగర్లోకి బల్కాపూర్, బంజారా, పికెట్ నాలాల నుంచి సివరేజ్ వాటర్, కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల ద్వారా ఇండస్ట్రియల్, కెమికల్ వేస్టేజీ వచ్చి చేరుతుంది. నాలాల నుంచి వచ్చే మురుగు, వ్యర్థాలను మొదటగా ఎస్టీపీల్లోకి మళ్లించి, అక్కడ క్లీన్ చేసిన తర్వాత మూసీలోకి వదులుతారు. ప్రస్తుతం కూకట్పల్లి నాలా నుంచి వచ్చే సివరేజీ నీళ్లు నేరుగా సాగర్లోకి వెళ్తున్నాయి. దీంతో, ట్యాంక్ బండ్ నుంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ నెల10, 16 తేదీల్లో సాగర్ నీటిని టెస్ట్ చేయగా.. నమూనాల్లో డీఓ లెవల్స్ మెరుగుపడ్డట్లు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(టీపీసీబీ) లెక్కలు ఈ విషయం స్పష్టంచేశాయి.కోలిఫామ్ కారకాలు, పీహెచ్ లెవల్స్తోపాటు డీజాల్వ్డ్ ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, నైట్రేట్ లెవల్స్ కూడా తగ్గినట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్తో జీడిమెట్ల, పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాల్లోని కంపెనీలు మూతపడడం వల్ల వాటి నుంచి కెమికల్ వ్యర్థాలు ఆగిపోయాయి. దాంతోనే సాగర్లో వాటర్ క్వాలిటీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.