దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోన ని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠిన నిబంధనలు అమలు చేస్తూ కరోనా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఏకంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం వైద్యులు కలియుగ దైవంగా మారిపోయాడు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ.. వృత్తి ధర్మం కోసం ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి కరోనా వైరస్పై పోరాటం చేస్తున్నారు.
ఇలా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స అందించే ఎంతో మంది వైద్యులు కూడా మహమ్మారి వైరస్ కోరల్లో చిక్కుకుని ప్రాణాలు విడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ పోరాటంలో వైద్యులు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న త్యాగం మరువలేనిది అనే చెప్పాలి. వారే లేకపోతే దేశం పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఊహకందని విధంగా ఉంటుంది. అయితే ఇప్పటికే చాలామంది వైద్యులు కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఇలా వైరస్ బారిన పడి చనిపోతున్న వైద్యుల సంఖ్య కూడా పెరిగిపోతుంది.
ఇక తాజాగా మరో వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. కోల్కతాలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ సోమవారం రాత్రి మరణించాడు. ఈనెల 14వ తేదీన అనారోగ్యం కారణంగా ఓ ప్రముఖ హాస్పిటల్లో చేరిన 69 ఏళ్ల ఆర్థోపెడిక్ డాక్టర్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక పది రోజుల పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స తీసుకున్న సదరు వైద్యుడు నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. పశ్చిమ బెంగాల్లోని ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు మృతి చెందిన డాక్టర్ బీప్లబ్ క్రాంతి దాస్ గుప్తా . ఇక అటు దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోతున్న వైద్యుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతోంది.