ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన పరిశ్రమలకు సంబంధించిన సమస్యలను తెలుసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ , వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, మే 15 నుండి రెండవ విడత రైతు భరోసా విడుదలకు సన్నాహాలలో భాగంగా రైతుల జాబితా సిద్ధం వాలంటీర్లు చేసినట్లు తెలిపారు. పుడై ప్రాసెసింగ్ పాలసీ ఆధునీకరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
కాకినాడ రూరల్లో తాటి చెట్లను నరికి గీత కార్మికులకు అన్యాయం చేస్తున్నట్లు కరోనాకు భయపడి హౌస్ క్వారంటైన్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ``కాకినాడ రూరల్లో గతంలో ఎపిఐసిసి రైతులు నుండి స్వాధీనం చేసుకున్న 130 ఎకరాల భూములను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరిగి రైతులకు ఇప్పించి ఆ భూములను ఇళ్ళ స్థలాల కోసం చదును చేస్తున్నప్పుడు సుమారు రెండు వందల తాటి చెట్ల ను తొలగిస్తే రాష్ట్రంలో గీత కార్మికులందరికీ అన్యాయం జరిగిపోయినట్టుగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. రాజధాని నిర్మాణం కోసం సారవంతమైన 33 వేల ఎకరాల్లో పండ్ల తోటలను నాశనం చేసి, కొబ్బరి,తాటి చెట్లను తొలగించి నప్పుడు మీకు గీత కార్మికులు గుర్తులేదా...? అమరావతి నిర్మాణం లో తాటి చెట్ల ను తీయకుండా రాజధాని నిర్మాణం ఏవిధంగా చేద్దామనుకున్నారో చెప్పండి. చెట్లను తొలగించకుండా రాజధానిని గ్రాఫిక్ లో చూపిద్దామనుకున్నారా...?` అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాల పనులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వం సడలింపు ఇచ్చిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దని ఉప ముఖ్యమంత్రి కోరారు. మోసపోవడం తప్ప మోసం చేయడం తెలియని రైతుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.