అదృష్టం అనేది ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా అదృష్టవంతులే అని చెప్పవచ్చు. గతంలో శాసనమండలిలో టీడీపీ ఆధిపత్యం ఉండటం...వైసీపీని ఇబ్బందులు పెట్టడంతో అనేక రకాల సమస్యలు వచ్చాయి. జగన్ మూడు రాజధానుల బిల్లు సమయంలో వివాదం తలెత్తడంతో సీఎం శాసనమండలి రద్దు దిశగా చర్యలు చేపట్టారు.
సీఎం మండలి రద్దు దిశగా చర్యలు చేపట్టినా కేంద్రం రద్దును ధృవీకరించాల్సి ఉంది. పార్లమెంటులో శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టడానికి జగన్ వెళ్లి మోదీ, అమిత్ షాను కలవడం జరిగింది. కానీ కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాబోయే నాలుగైదు నెలల వరకు ఉభయ సభలు జరిగే అవకాశం లేదు. ఉభయ సభలు జరిగితే మాత్రమే మండలి రద్దయ్యే అవకాశం ఉంది.
టీడీపీ ఎమ్మెల్సీలలో చాలామంది పదవీకాలం అయిపోయే వరకు ఎమ్మెల్సీలుగా కొనసాగవచ్చు. రిటైర్మెంట్ అనంతరం వచ్చే ప్రయోజనాలు కూడా వీరు పొందవచ్చు. వైసీపీకి మాత్రం శాసనమండలి రద్దు బిల్లు వల్ల భారీ నష్టమే కలగనుంది.
బిల్లు ఆలస్యమయ్యే కొద్దీ టీడీపీకి లాభం చేకూరనుండగా వైసీపీకి నష్టం చేకూరనుంది. వైసీపీలో చాలా మంది ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాబోయే సంవత్సరాలలో అధికారంలో ఉన్న వైసీపీకే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు దక్కేవి. కానీ కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోనుంది. వైసీపీ మండలి రద్దు దిశగా చర్యలు చేపట్టకపోతే 2022లోపు శాసనమండలిలో వైసీపీకి పూర్తిస్థాయి ఆధిపత్యం ఉండేది.