ఇప్పడు అందరి చూపు కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కొనసాగింపు పైనే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్లో ఉన్నది. మొదట మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని.. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరుగడంతో లాక్డౌన్ గడువును మే 3 వరకు పొడిగించారు. మరో మూడు రోజుల్లో ఆ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో దేశంలో సుప్రసిద్దుడై ప్రముఖుడు కీలక సూచనలు చేశారు. లాక్డౌన్ను మరో దఫా పొడిగిస్తే దేశవ్యాప్తంగా కరోనా వైరస్తో మరణించిన వారికంటే ఆకలి ద్వారా మరణించేవారి సంఖ్యే అధికంగా ఉండే అవకాశం ఉన్నదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి హెచ్చరించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు నారాయణ మూర్తి. లాక్డౌన్ను పొడిగిస్తే దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న 19 కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని మూర్తి హెచ్చరించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ కారణంగా వ్యాపార రంగాలు స్తంభించిపోయాయని, ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఉత్పత్తి విభాగంలో పనిచేసేవారిని వీలైనంత తొందరగా భాగస్వామ్యం చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరణిస్తున్న వారితో పోలిస్తే భారత్లో చాలా స్వల్పం అని నారాయణమూర్తి అన్నారు. కరోనా వైరస్తో దేశీయంగా వెయ్యి మందికి పైగా మరణించారు. ప్రస్తుతం భారత్లో ప్రతియేటా వివిధ కారణాలతో 90 లక్షల మంది మరణిస్తుండగా, వీరిలో నాలుగో వంతు కాలుష్యం భారిన పడి మరణిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా కాలుష్యానికి గురవుతున్నది భారత దేశమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.