మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో... కరోనా కారణంగా చనిపోయిన వారికి సంబంధించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా భోపాల్లో 15 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా... వారిలో 13 మంది... 1984 నాటి గ్యాస్ దుర్ఘటన బాధితులే. ఆలస్యంగా చికిత్స చేయడమే వాళ్ల మరణానికి కారణమని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి.
భోపాల్ విష వాయువు ఘటన బాధితుల్లో 13 మంది కరోనా వైరస్తో చనిపోవడం... మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. భోపాల్లో ఇప్పటిదాకా 15 మంది కొవిడ్-19 కారణంగా చనిపోగా... వారిలో 13 మంది గ్యాస్ ప్రమాద బాధితులే. పైగా... 13 మందీ చనిపోయింది వైరస్ సోకడం వల్లేనని... వాళ్లు ప్రాణాలు కోల్పోయిన తర్వాతే తెలిసింది. 13 మంది మృతదేహాల నుంచి తీసుకున్న శాంపిల్స్ను పరీక్షలకు పంపిన వైద్యాధికారులు... వైరస్ సోకడం వల్లే వారు చనిపోయినట్లు ప్రకటించారు.
భోపాల్లో కరోనా లక్షణాలు కనిపించిన వారిలో గ్యాస్ ప్రమాద బాధితులే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదనీ... ప్రత్యేకంగా వైద్యం అందించే ప్రయత్నం చేయలేదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. గ్యాస్ దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ గుండె, కిడ్నీ, ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని... అలాంటి వారికి వైరస్ సోకడంతో... కొద్దిరోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి... గ్యాస్ ప్రమాద బాధితుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా సరే... పరీక్షలు జరిపి, వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు... గ్యాస్ ప్రమాద బాధితులే ఎక్కువగా కరోనా వల్ల చనిపోతున్నారని తెలియగానే... వారున్న ప్రాంతాల్లో కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామంటున్నారు.... అధికారులు. అయితే... ఇప్పుడు తీసుకోవాల్సింది జాగ్రత్త చర్యలు కాదని... బాధితులకు వైద్య పరీక్షలు చేయించడం, పాజిటివ్గా తేలితే వెంటనే చికిత్స అందించడం అని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. ఎంత త్వరగా ఆ పని చేస్తే... అంత త్వరగా ప్రాణ నష్టాన్ని నివారించినట్టేనని అభిప్రాయపడుతున్నాయి.