కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు తీపికబురు వినిపించింది. జన్ ధన్ ఖాతాలు ఉన్న వారి అకౌంట్లో డబ్బులు జమ చేయనుంది. సోమవారం ప్రధాన్ మంత్రి జన్ ధన యోజన ఖాతాల్లో రెండో విడత మరో రూ.500 డిపాజిట్ కానున్నాయి. వీటిని విత్ డ్రా చేసే విషయంలో కేంద్రం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నగదు విత్ డ్రా చేసుకోవడం కోసం బ్యాంకుల వద్ద రద్దీని తగ్గిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా మార్గదర్శకాల్ని జారీ చేసినట్లు బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా చెప్పారు.
కరోనా వైరస్ నుంచి పేదల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి మూడు నెలలు పాటు ప్రతీ నెల రూ.500 బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయనుంది. ఇప్పటికే తొలి విడత డిపాజిట్ పూర్తయింది. విడతల వారీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద కుటుంబంలో ఒక మహిళకు ఒక్క అకౌంట్ ఉంటే మే 4న, ఇద్దరు లేదా ముగ్గురు మహిళలకు అకౌంట్లు ఉంటే మే 5న, 4లేదా 5అకౌంట్లు ఉంటే మే 6న, 6లేదా 7 అకౌంట్లు ఉంటే మే 8న, 8లేదా 9 అకౌంట్లు ఉంటే మే 11న బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర బ్యాంక్ ఎటిఎంల నుండి డబ్బును ఉపసంహరించుకోవటానికి ఎటువంటి ఛార్జీలు ఉండవని బ్యాంకింగ్ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్ పాండా అన్నారు. బ్యాంక్ ల వద్ద రద్దీని తగ్గిస్తూ రూపే, బ్యాంక్ మిత్రాస్, కస్టమర్ సర్వీస్ పాయింట్స్, ఏటీఎంలలో డబ్బుల్ని డ్రా చేసుకోవాలని పాండా కోరారు.