ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా టెన్షనే. ఈ వ్యాధితో ప్రజలు, పాలకులు, దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి. భారతదేశం సైతం దీనికి మినహాయింపేం కాదు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉన్నది. రోజురోజుకు కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఆదివారం ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,980కి చేరింది. ఇలా కరోనాకలకలం కొనసాగుతున్న తరుణంలో యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్)లో సేవలు అందిస్తున్న డాక్టర్ అస్సీమ్ మల్హోత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ మూలాలు ఉన్న ఈ వైద్యుడు మన దేశ పరిస్థితుతులను విశ్లేషించారు.
భారతీయుల ఆహారపు అలవాట్ల వల్లే కరోనా మరణాలు సంభవిస్తున్నాయని మల్హోత్రా వివరించారు. “ వ్యాధుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేలా ఇండియా జీవనశైలి ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు లాంటి పరిస్థితులు కరోనా సోకేందుకు ప్రధాన కారణం. శరీరంలో ఉండే ఫ్యాట్ వల్ల ఇవి వస్తాయి. అలాంటి వాళ్ల సంఖ్య అక్కడ ఎక్కువగానే ఉంది” అని మల్హోత్రా అన్నారు.
భారతీయులు ప్యాకేజ్ ఫుడ్ పక్కన పెట్టాలని, చిరుతిండి కాకుండా చక్కగా వండుకొని తినాలని ఆయన సూచించారు. ఒబెసిటీ, అధిక బరువు వల్ల కూడా ఇబ్బంది ఉంటుందని అన్నారు. యూఎస్, యూకేలో అలాంటి ఫుడ్ తిని అందరూ అధిక బరువుతో ఉన్నారని, దాని వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా రిఫైండ్ కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, దాని ప్లేస్లో కూరగాయలు, పండ్లు తీసుకోవాలని అన్నారు. రెడ్ మీట్, డైరీ ప్రాడెక్ట్స్, గుడ్లు, చేప లాంటివి కూడా మంచి ఆహారం అని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయినా ఇప్పటికైనా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం మానేసి వైరస్ బారిన పడకుండా మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పారు.