యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి చైనాను ఇప్పట్లో వీడేట్టు కనిపించడంలేదు. తాజాగా అక్కడ 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారిలో 12 మందిలో ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకుండానే కరోనా పాజిటివ్ గా తేలింది. చైనాలో మొదలైన ఈ బీభత్సం ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. అమెరికాలో మరీ దారుణంగా 60 వేలకు పైగా మరణాలు సంబవించాయంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలిసిపోతుంది.  ఇదిలా ఉంటే ప్రస్తుతం చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,877 కాగా, 4,633 మంది మరణించారు. ఇక, దేశీయంగా కరోనా సంక్రమణం తగ్గిపోగా, విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల కనిపిస్తోంది.

 

అయితే చైనాలో గత డిసెంబరు చివరి వారంలో కరోనా బీభత్సం మొదలయ్యాక ఆశ్చర్యకర పరిణామం చోటుచేసుకుంది. వుహాన్ లో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న షీ ఝెంగ్లీ ఉన్నట్టుండి అదృశ్యమైంది. పాశ్చాత్యదేశాలకు వుహాన్ వైరాలజీ ల్యాబ్ గుట్టుమట్లు చెప్పేసిందని, అందుకే అమెరికా వంటి దేశాలు చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయని కొన్ని వాదనలు వినిపించాయి. తాజాగా లాంటి సందేహాలన్నింటికి చెక్ పెడుతూ, షీ ఝెంగ్లీ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

 

ఇటీవలి తన ఫొటోలను పోస్టు చేసింది. తనకు, తన కుటుంబానికి ఏమీ కాలేదని స్పష్టం చేసింది. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని, పాశ్చాత్య సమాజానికి రహస్యాల చేరవేత అనేది అసత్య ప్రచారం అని కొట్టిపారేసింది. తాను అలాంటి తప్పుడు పని ఎప్పుడూ చేయనని అన్నారు.  సైన్స్ పై తనకు బలీయమైన నమ్మకం ఉందని, మబ్బులన్నీ తొలగిపోయి సూర్యుడు మిలమిల ప్రకాశించే రోజు కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. ఇక కరోనా వైరస్ వుహాన్ సమీపంలోని గబ్బిలాల ద్వారానే వ్యాప్తి చెంది ఉండొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: