దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న తరుణంలో... వేలాది మంది వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా పోరులో అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి గుర్తుగా ఆకాశంలో నుంచి పూల వర్షం కురిపించి మన మమకారం చాటుకున్నాం. కానీ అలా పూలు చల్లించుకునే వైద్యులే కాకుండా చెప్పు దెబ్బలు తినే వైద్యులు సైతం ఉంటారని పలువురు అంటున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్తో ఒక డాక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ముంబైలో జరిగింది.
ముంబై సెంట్రల్ లోని ఒక ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్న కరోనా మగ పేషెంట్పై ఓ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో వెలుగులోకి రావడంతో ఆస్పత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు డాక్టర్పై కేసు నమోదు చేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్తో అసభ్యంగా ప్రవర్తించినందున నిందితుడిని అరెస్ట్ చేయలేదని.. అతడ్ని క్వారంటైన్లో ఉంచామని పోలీసులు పేర్కొన్నారు. క్వారంటైన్ పీరియడ్ ముగిశాక అతడ్ని అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుడు ఈ ఘటనకు పాల్పడటానికి ఒక రోజు ముందు సదరు ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అవడం గమనార్హం.
ఇదిలాఉండగా, కరోనా వ్యాధి నిర్మూలన కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేమని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లోని వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పేషెంట్ కేర్ అసిస్టెంట్లు, వార్డు బాయ్లు, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది, పరిపాలనా విభాగం ఉద్యోగులు, పోలీసులు, అధికారులు, పారిశుధ్య సిబ్బందిపై ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పూల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా వారు తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి కాలనీ వాసులందరూ కలిసి రోడ్డుకు ఇరువైపులా ఉండి చప్పట్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సన్మానించి పూలమాలతో అభినందనలు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో దుర్మార్గం ప్రవర్తించిన ఈ ముంబై వైద్యుడి ఉదంతం చర్చనీయాంశంగా మారింది.