కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. వీరి మనసంతా సొంత గడ్డపైనే ఉంది. ఎప్పుడెప్పుడు సొంత గూటికి చేరుతామా అనే ఉంది. ఇలాంటి తరుణంలో విదేశాల్లోని మన వారికి గుడ్ న్యూస్. వారందర్నీ మే 7వ తేదీ నుంచి ఇండియాకు దశలవారీగా తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీని కోసం భారీ ఆపరేషన్ చేపట్టనున్నారు.
గల్ఫ్ దేశాల్లో సుమారు 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలుత గల్ఫ్ దేశాల నుంచి ఆ తర్వాత యురోప్ దేశాల్లో చిక్కుకున్నవారిని తీసుకు రానున్నారు. విమానాలు, భారీ నౌకల ద్వారా తరలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లయిట్స్ను ఏర్పాటు చేస్తున్నామని, ఆ విమాన సేవలు పేమెంట్ ఆధారంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. విమానం ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు చేపడుతామని, కేవలం లక్షణాలు లేని వారిని మాత్రమే భారత్కు తీసుకు వస్తామని కేంద్రం ప్రకటించింది. ఒకసారి భారత్కు చేరుకున్న తర్వాత.. వారంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల క్వారెంటైన్ తర్వాత కోవిడ్19 పరీక్ష చేయించుకోవాలి. అయితే ఎంత మంది భారతీయులను వెనక్కి రప్పించే ప్రణాళిక వేశారన్న విషయం స్పష్టంగా తెలియదు.
ఇదిలాఉండగా, భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. దేశంలో 24 గంటల వ్యవధిలో 2573 కొత్త కేసులు నమోదు కాగా 83 మంది చనిపోయారు. ఇంతవరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కాలేదు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42836కు పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 29685 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 11762 మంది కోలుకున్నారు. కరోనా వల్ల 1389 మంది మరణించారు. మహారాష్ట్ర(12974), గుజరాత్(5428), ఢిల్లీ(4549), తమిళనాడు(3023) రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.