ఏపీలో మందు బాబులకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ముందు నుంచి జగన్ మద్యపాన నిషేధం విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటూ వస్తున్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యపాన నిషేధం విషయంలో సీరియస్గా ఉంటున్నారు. ఇక దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ పలు షాపులకు కోత పెట్టేశారు. ఇక వైసీపీ మంత్రులు సైతం పదే పదే ఇదే విషయం చెపుతున్నారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు అన్ని బంద్ చేశారు.
ఇక నిన్న 25 శాతం ధరలు పెంచిన జగన్ సర్కార్ కేవలం ఒక రోజు తేడాలోనే మరో అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఈ రోజు ఏకంగా 50 శాతం ట్యాక్స్ వేయడంతో ఇప్పుడు మందు రేట్లు ఏకంగా 75 శాతం పెరిగిపోయాయి. అంటే ఇక తాగినోళ్లకు తాగినంత అన్నట్టుగా ఇప్పుడే తాగేయాలి.. రేపో మాపో జగన్ ఇంకెన్ని షాకులు మందుబాబులకు ఇస్తారో ? తెలియని పరిస్థితి. ఇక భవిష్యత్తులో మందు దొరికే పరిస్థితి కనిపించట్లేదు అన్నట్లుగా కూడా ఉంది. ఒక వేళ అరా కొరా దొరికినా సామాన్యులు ఎవ్వరూ కొనే పరిస్థితి లేదు.
ఇక జగన్ మంగళవారం సమీక్షలో సైతం మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. షాక్ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం అని చెప్పారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. ఇక ఇప్పుడు ఉన్న రేట్లపై 75 శాతం పెంచడం అంటే మందు బాబులు మందు పేరు చెపితేనే భయపడి పారిపోయే పరిస్థితి వచ్చేసింది.