గ‌త కొద్దికాలంగా ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా సెల్ప్ గోల్ చేసుకున్న‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వివిధ అంశాల‌పై ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న స్పందిస్తున్న తీరు స‌హ‌జంగానే రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, తాజాగా ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన మ‌ద్యం విష‌యంలో మాత్రం సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని అంటున్నారు.  వైసీపీ తాజాగా ఇచ్చిన కౌంట‌ర్ దీనికి తార్కాణం.

 

వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ, త‌మ ప్ర‌భుత్వ మ‌ద్య విధానంపై ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంతోనే దాదాపు నెల‌న్న‌ర‌ త‌ర్వాత లిక్క‌ర్ షాపులు ఓపెన్ చేశామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో లిక్కర్ అమ్మితే చంద్రబాబు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని అంబ‌టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లిక్కర్ అమ్మకంపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించ‌లేక‌పోతున్నార‌ని అంబ‌టి సూటిగా ప్ర‌శ్నించారు.

 

చంద్రబాబుకు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే అర్హ‌త లేదని అంబ‌టి మండిప‌డ్డారు. ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు తూట్లు పొడిచి.. రాష్ట్రంలో మ‌ళ్లీ మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌లుపెట్టార‌ని గుర్తు చేశారు. ఆ విష‌యాల‌ను ప్రజలు మర్చిపోయార‌ని చంద్రబాబు అనుకుంటున్నార‌ని, అందుకే త‌మ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. మీడియాలో ప్ర‌చారం కోస‌మే ఆయ‌న డ్రామాలాడుతున్నార‌ని ఆరోపించారు. ద‌శ‌ల వారీగా మ‌ద్యపాన నిషేధం చేస్తామ‌ని త‌మ పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్న అంబ‌టి త‌మ విధానంలో మార్పులేద‌ని స్ప‌ష్టం చేశారు. ధ‌రలు పెంచడం ద్వారా మ‌ద్య‌పానాన్ని కంట్రోల్ చేస్తామ‌ని ఎన్నిక‌ల ముందే చెప్పామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌కు మద్యం తాగొద్దని చెప్పాల్సిన చంద్రబాబు బ్రాండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్ర‌శ్నించారు.

 

చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చింది హైద‌రాబాద్‌లో ఉండ‌డానికి కాదని  అంబ‌టి రాంబాబు అన్నారు. క‌రోనా టెస్టుల్లో దేశంలోకెల్లా ఏపీ తొలి స్థానంలో ఉంద‌ని, వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఏ ఒక్క‌రోజైనా చంద్ర‌బాబు పొగిడారా అని  అంబ‌టి ప్ర‌శ్నించారు. క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు హైద‌రాబాద్ ఉంటారా అని అడిగారు. వ‌ల‌స ‌కూలీలు, విద్యార్థులు రాష్ట్రానికి వ‌స్తున్నార‌ని, చంద్ర‌బాబు కూడా వ‌చ్చి క‌ర‌క‌ట్ట నివాసంలో క్వారంటైన్ లో ఉండాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: