తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలు వంటి తదితర అంశాలపై మంత్రివర్గంలో సమాలోచనలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
కరోనా వైరస్ ప్రభావం కారణంగా మార్చి 22న రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్డౌన్ అవసరమని పలువురు ఆరోగ్య నిపుణులు సూచించారని సమాచారం. కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో లాక్డౌన్ను అత్యంత కఠినంగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒకరోజు తగ్గడం, మరొకరోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించడమే మంచిదని ఆరోగ్యశాఖ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 70 రోజుల సైకిల్ పూర్తిచేయడమే సబబు అని ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీనిపైనా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన విషయం సుదీర్ఘం చర్చ సాగినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకొని ఈ నాలుగు జిల్లాల్లో లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని సీఎం కేసీఆర్కు సిఫారసు చేశారని సమాచారం. మిగిలిన జిల్లాల్లో కొవిడ్-19 కేసులతోపాటు కంటైన్మెంట్ జోన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారని సమాచారం.
ఇదిలాఉండగా, సోషల్ డిస్టెన్స్ అనే పదం మీడియా ఉపయోగిస్తుండటం సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్స్ అనే పదం అర్థం సాంఘిక దూరం అవుతుందని అది సరైన పదం కాదని అన్నారు. దాని బదులుగా ఫిజికల్ డిస్టెన్స్ అంటే భౌతిక దూరం అని పేర్కొనాలని కేసీఆర్ కోరారు.