కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని సహజంగానే ఆకర్షిస్తుంది. పైగా కష్టకాలంలో వారు ఏ నిర్ణయం తీసుకున్నా లక్షల మందిపై ప్రభావం పడుతుంది. అలా కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపే ఓ నిర్ణయం విషయంలో కేంద్రం వైఖరి చర్చకు తెర లేపింది. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్' పేరిట కేంద్రం అతిపెద్ద మిషన్కు సన్నాహాలు చేస్తోంది. ఇంత భారీ మిషన్లో కూడా అదే స్థాయిలో లోపాలు ఉండటం గమనార్హం.
కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్లో భాగంగా మే 7 నుంచి 13 వరకు 64 విమానాల్లో, మూడు యుద్ధ నౌకల్లో 14,800 మందిని స్వదేశానికి తీసుకురానున్నట్టు తెలిపింది. 12 దేశాల నుంచి వారిని తరలించనున్నట్టు పేర్కొంది. అయితే గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తమను తీసుకుపోవాలని 30 లక్షల మంది భారతీయ వలస కార్మికులు ప్రభుత్వానికి వినతులు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు 10 వేల మంది భారతీయులకు కరోనా సోకినట్టు సమాచారం. మహమ్మారి కారణంగా ఇప్పటికే 84 మంది భారతీయులు మరణించారు. ఆ దేశంలో విధించిన ఆంక్షల కారణంగా పనులు లేక ఎంతో మంది భారతీయ కూలీలు తీవ్రమైన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు వైరస్ సోకిన వారిని నిర్బంధించిన కేంద్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సరైన వసతుల్ని కూడా కల్పించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో ఆందోళనకు గురైన వలస కార్మికులు.. తమకు కొవిడ్-19 సోకుతుందేమోనని భయపడుతున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు లక్షలమంది భారతీయులు స్వదేశానికి రావడానికి పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే కేంద్రం 14,800 మందినే తరలిస్తామని చెప్పడంతో తమ పరిస్థితేంటని.. గల్ఫ్లోని వేలాది మంది కూలీలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తమను కూడా తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.