కరోనా వల్ల భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే భారత్లో మొట్టమొదటి కరోనా కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత ఆమె కోలుకుంది.అయితే కేరళ రాష్ట్రంలో బుధవారం (మే 6) కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30 ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. బుధవారం మరో ఏడుగురు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో కేరళలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 93.42 శాతం కావడం విశేషం. రాష్ట్రంలో రికవరీ రేటు పెరుగుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కేరళలో ప్రజలు లాక్ డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా ఇంటికే పరిమితం అయ్యి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.
అయితే కేరళలో వరసగా రెండు రోజుల పాటు ‘0’ కరోనా కేసులు నమోదైన తర్వాత మంగళవారం కొత్తగా 3 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.దీనితో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని ప్రజలు ప్రభుత్వం నిరుత్సహపడ్డారు. కానీ మళ్లీ బుధవారం ‘0’ కేసులు నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.లాక్ డౌన్ వల్ల ఆశించినంత ఫలితం దక్కింది అని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే కేరళలో కరోనా కారణంగా నాలుగు నెలల ఓ పసికందు సహా ముగ్గురు మరణించారు. ముందునుంచి కేరళలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నట్లే కనిపించినా కానీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది.రానున్న రోజులలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా నమోదు కావని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..